ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అమీర్ అలీఖాన్ ప్రమాణం
– కాంగ్రెస్ సర్కారుకు కృతజ్ఞతలు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అమీర్ అలీఖాన్ బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరామ్, అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ప్రమాణం చేయించారు. 2023 జులైలో బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్కుమార్, కుర్రా సత్యనారాయణలను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించాలంటూ చేసిన సిఫార్సులను అప్పటి గవర్నర్ రద్దు చేసిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ప్రొఫెసర్ కోదండరాం, ఆమెర్ అలీఖాన్లను ఆ ఎమ్మెల్సీ స్థానాల్లో నియమించడాన్ని గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై తెలంగాణ హైకోర్టు మార్చి 7వ తేదీన ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు బుధవారం స్టే విధించింది. దీనిపై సుప్రీంకోర్టు తాజాగా స్టే ఉత్తర్వులిచ్చింది. ఆ స్థానాల్లో కొత్తవారి నియామకాలను నిలిపివేయాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని తోసిపుచ్చింది. కొత్తవారి నియామకాలను ఆపలేమని పేర్కొంది. దీంతో ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అమీర్ అలీఖాన్ బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ తాను ఎమ్మెల్సీ కావడంతో ఉద్యమకారులు సంతోషంగా ఉన్నారని కోదండరామ్ అన్నారు. ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. దీన్ని అదనపు బాధ్యతగా మాత్రమే భావిస్తున్నానన్నారు. ఉద్యమకారులు, అమరవీరుల ఆకాంక్షల మేరకు పని చేస్తానని తెలిపారు. అనేక మంది బలిదానాలు చేయడం వల్లే తాము ఈ స్థానంలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి, పొన్నం తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

