పురుగుల మందు తాగి… సెల్ టవర్ ఎక్కి..!
– చస్తానని వ్యక్తి హల్ చల్
– భార్య కాపురానికి రావడం లేదని ఆత్మహత్యాయత్నం
– నచ్చజెప్పీ అదుపులోకి తీసుకున్న పోలీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : భార్య కాపురానికి రాకపోవడంతో పాటు పోలీస్టేషన్కు ఎక్కించిందని ఓ భర్త పురుగుల మందు సేవించడమే కాకుండా సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నంతో హల్ చల్ చేశాడు. పోలీసులు నచ్చజెప్పి కిందకు దించి అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన ఆదివారం తాండూరు మున్సిపల్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలం దామర్ చెడ్ గ్రామానికి చెందిన ఆంజనేయులు ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. గత కొన్నేళ్ల క్రితమే లక్ష్మీ అనే మహిళతో వివాహాము జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉన్నారు.
వారిద్దరి మద్య మనస్పర్థలు రావడంతో మూడు రోజుల క్రితం భార్య ఇంటి నుంచి పుట్టింటికి వెళ్లింది. కాపురానికి రమ్మని పిలిచిన రాలేదు. గొడవ పెద్దది కావడంతో పోలీస్టేషన్ వద్దకు పంచాయతీ వెళ్లింది. దీంతో మనస్థాపం చెందిన అంజి ఆదివారం గుర్తుతెలియని పురుగుల మందు సేవించాడు. గ్రామం నుంచి తాండూరుకు చేరుకున్నాడు. మధ్యాహ్నం వేళ పాత తాండూరు సమీపంలో ఉన్న ఓ సెల్ టవర్ ఎక్కాడు. గమనించిన స్థానికులు పట్టణ పోలీసులకు సమాచారం అందించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అంజితో మాట్లాడారు. జీవితం, పిల్లల గురించి వివరించి నచ్చజెప్పడంతో అంజి కిందకు దిగివచ్చాడు. అప్పటికే పురుగుల మందు సేవించానని తెలపడంతో అతన్ని స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి పోలీసులు అదుపులోకీ తీసుకున్నారు. కాగా నిందితుడు సెల్ టవర్ ఎక్కి హల్ చేయడంతో ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఇదికూడా చదవండి..

