పిచ్చోడి.. వీరంగం..!
– అర్దరాత్రి నర్సింగ్ హాస్టల్లోకి ప్రవేశం
– భయాందోళనకు గురైన విద్యార్థులు
– కేసు నమోదు చేసిన పోలీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : మతిస్థిమితం లేని ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. అర్దరాత్రి నర్సింగ్ కాలేజీ హాస్టల్ గేటు ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించాడు. హాస్టల్లో ఉన్న అమ్మాయిలు భయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటన తాండూరు పట్టణ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ సంతోష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు పట్టణంలోని పీపీ యూనిట్లో ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ కొనసాగుతోంది. ఇందులో 50 మంది అమ్మాయిలు నర్సింగ్ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు.
సోమవారం అర్దరాత్రి 2-30గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి కళాశాల గేటు తాళాలు ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించాడు. అరుపులతో హంగామా చేయడంతో హాస్టల్లోని అమ్మాయిలు భయాందోళనకు గురయ్యారు. హాస్టల్ లో ఉన్న ఓ వ్యక్తి అతన్ని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. నిందితుని గురించి విచారణ చేయగా కర్ణాటక రాష్ట్రం, గుల్బర్గా జిల్లా, చించొల్లి తాలుకాలోని నిడుగుందకు చెందిన ఎండి ఇమాంసాబ్గా గుర్తించారు. నిందితుడికి గత కొన్ని రోజుల నుంచి మతిస్థిమితం సరిగ్గా లేదని గుర్తించారు. కాలేజీ ప్రిన్సిపల్ విజయ రాణి ఫిర్యాదు మేరకు నిందితుడిపై హెల్త్ కేర్ యాక్టు ప్రకారం కేసు నమోదు చేయడం జరిగిందని సీఐ సంతోష్ కుమార్ తెలిపారు.
ఇదికూడా చదవండి…

