పేద విద్యార్థులకు ఎడ్యూకేషన్ లోన్..!
– ఎలాంటి ష్యూరీటీ లేకుండానే మంజూరు
– కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం
– అర్హతలు, దరఖాస్తుల విధానం ఇదే..
దర్శిని డెస్క్ : పేదరికంలో ఉండి ఉన్నత చదువులకు దూరమవుతున్న విద్యార్థులకు కేంద్రం ఎడ్యూకేషన్ లోన్ అందిస్తోంది. ఎలాంటి ష్యూరిటీలు లేకుండా లక్షల ఆర్థికసాయం అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకంపై సరైన అవగాహన లేకపోవడంతో చాలా మంది వినియోగించుకోలేపోతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్నత చదువులకు దూరమవుతున్న వారికి అండగా నిలిచేందుకు వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా.. పీఎం విద్యాలక్ష్మీ పథకానికి శ్రీకారం చుట్టారు.

15 రోజుల్లోనే మంజూరు
ఈ పథకం కింద రుణం కోసం దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోనే తక్కువ వడ్డీతో ఈ పథకం కింద రుణాన్ని మంజూరు చేస్తారు. రుణం అవసరం ఉన్న వారు విద్యాలక్ష్మి పోర్టల్లో దరఖాస్తు చేస్తే సరిపోతుంది. చదువుకు అయ్యే ఖర్చులతోపాటు ట్యూషన్ రుసుం, వసతి, రవాణా ఖర్చులను కూడా కలిపి రుణం పొందొచ్చు. ఎలాంటి ప్రాసెసింగ్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. రుణం కోసం దరఖాస్తు చేసిన తర్వాత దాని స్థితిని ఎప్పటికప్పుడు విద్యాలక్ష్మి పోర్టల్లో బ్యాంకు అధికారులు నవీకరిస్తారు. రుణం మంజూరైందా లేదా అనే విషయం 15 రోజుల్లో తెలుస్తుంది. అవసరమైన ధ్రువపత్రాలు జత చేయకపోతే దరఖాస్తును పెండింగ్లో ఉంచుతారు. పోర్టల్లోని డ్యాష్బోర్డులో పరిశీలన చేసి విద్యార్థులు ఈ విషయాన్ని తెలుసుకోవచ్చు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..?
విద్యార్థులుhttps://pmvidyalaxmi.co.in లోకి వెళ్లి విద్యార్థి పేరు, చరవాణి సంఖ్య, ఈమెయిల్ ఐడీ, చిరునామా, తదితర వివరాలు నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత సాధారణ విద్యారుణం దరఖాస్తు ఫారం పూర్తి చేయాలి. దరఖాస్తుతోపాటు అవసరమైన ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాలి. తగిన అర్హతలు ఉన్న వారికి మూడు రకాలుగా రుణాలు మంజూరు చేస్తారు. మొదటి విభాగంలో రూ.4 లక్షలలోపు, రెండో విభాగంలో రూ.4 లక్షల నుంచి రూ.7.5 లక్షలు, మూడో విభాగంలో రూ.7.5 లక్షలకు పైగా రుణాన్ని మంజూరు చేస్తారు.

అర్హతలు ఇవే..
దరఖాస్తు చేసుకునేందుకు పది, ఇంటర్, డిగ్రీ మార్కుల జాబితాలు, చివరిసారిగా చదివిన కోర్సుకు సంబంధించిన ఉత్తీర్ణత పత్రం, తదుపరి చదవాలనుకుంటున్న కోర్సుకు సంబంధించిన అడ్మిషన్ పత్రాలు, ఆదాయ ధ్రువపత్రం, రుణం కోసం దరఖాస్తు చేయడానికి ఏడాది ముందు చదివిన కోర్సు ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. దీనికి తుది గడువు కూడా ఏమీ ఉండదు. విద్యార్థి రుణం పొందడానికి కుటుంబ వార్షికాదాయం రూ.4 లక్షల లోపు ఉండాలి. ఒక్కొక్కరు ఒకే దరఖాస్తు చేసుకోవాలి. డిగ్రీ, వైద్యం, ఇంజినీరింగ్, వృత్తి విద్యాకోర్సులు, వివిధ రకాల ప్రొఫెషనల్ కోర్సులు, అండర్ గ్రాడ్యుయేట్ చదివే విద్యార్థులతోపాటు విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేసే వారు కూడా రుణానికి దరఖాస్తు చేసుకోవచ్చు. సందేహాలు నివృత్తి చేసుకునేందుకు టోల్ఫ్రీ నెంబర్ 18001031లో సంప్రదించవచ్చు.

ఇదికూడా చదవండి…

