పత్తి విక్రయాలు ఈజీ..!
– రద్దీ లేకుండా అమ్మకాలు
– కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుకింగ్తో అవకాశం
– చెల్లింపులు… పెండింగ్లు కూడా నేరుగా తెలుసుకోవచ్చు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : పత్తి రైతుల పంట అమ్మకాలను సులభతరం చేసేందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) చర్యలు చేపట్టింది. దేశంలోనే తొలిసారిగా కపాస్ కిసాన్ అనే పేరుతో ఓ యాప్ను అందుబాటులోకి తెచ్చింది.

పత్తి పంట పండించే రైతులు తమ పేర్లను సెప్టెంబరు 1 నుంచి 30 వరకు ఈ యాప్లో ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది. అలా నమోదు చేసుకున్న వారే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు కేంద్రాల్లో తమ సరకు విక్రయించుకునే అవకాశం వెసులుబాటు ఉంటుంది.
ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం పత్తి క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ.8,110గా ప్రకటించిన విషయం తెలిసిందే. కనీస ధర పొందాలంటే కపాస్ కిసాన్ యాప్లో రిజిస్టర్ అయిన రైతులు పత్తి విక్రయ సమయంలో తప్పనిసరిగా స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఏ రోజు సీసీఐ కేంద్రంలో వారు విక్రయించాలో వివరాలు తెలుపుతూ యాప్ ఆ మేరకు సమాచారాన్ని రైతులకు అందిస్తుంది. ఇలా చేయటం వల్ల రోజుల తరబడి నిరీక్షించాల్సిన బాధ రైతులకు ఉండదు. స్లాట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుందని సీసీఐ ప్రకటించింది.
స్లాట్ బుకింగ్ ఇలా..
ముందుగా ఆండ్రాయిడ్ ఫోన్లో ప్లే స్టోర్కు వెళ్లి కపాస్ కిసాన్ యాప్ను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలి. ఆ తర్వాత భాష ఎంపిక చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రైతులు తమ మాతృభాషను ఎంచుకోవచ్చు. హోమ్ పేజీలో క్లిక్ చేసే బుకింగ్ ఫామ్ తెరుచుకుంటుంది. ఈ ఫారమ్లో రిజిస్ట్రేషన్ చేసుకోబడిన వివరాలు ఉంటాయి. జిల్లా, మార్కెట్, అంచనా వేసిన దిగుబడిని క్వింటాళ్లలో నమోదు చేయాలి. ఇంకా మిగులు పరిమాణం అంచనా కూడా నమోదు చేయాలి. ఆ తర్వాత మూడు రోజుల వరకు తేదీల్లో స్లాట్ సమయం, ఎన్ని స్లాట్లు ఉన్నాయో, మిల్లు సామర్థ్యం వివరాలు చూపుతుంది. తెరిచిఉన్న స్లాట్ను బుక్ చేసి నిర్ధారణ చేస్తే ఐడీతో స్లాట్ విజయవంతంగా బుక్ చేసినట్లు సందేశం చూపుతుంది. హోమ్ పేజీలో స్లాట్ బుకింగ్ తేదీ, సమయం, మిల్లు వివరాలు కనిపిస్తాయి. స్లాట్ను రద్దు చేయాలనుకుంటే యాప్లో కారణం నమోదు చేసి రద్దు చేసుకునే వీలు కూడా ఉంది. ఆ తర్వాత లాగ్ అవుట్ కావాలి.

ఇదికూడా చదవండి…

