కాబోయే సర్పంచులు కాస్త తెలుసుకోండి..!

తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్

కాబోయే సర్పంచులు కాస్త తెలుసుకోండి..!
– సర్పంచులకు, వార్డు సభ్యులకు రూల్స్
– నామినేషన్లపై క్లారిటీ ఉండకపోతే అంతే
– పోటీ చేసేందుకు ఎవరు అనర్హులు అటే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌తో పల్లెల్లో రాజకీయం వేడేక్కింది. గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణ జరగతుండడంతో ఆశావాహులు పోటీకి సై అంటున్నారు. గతంలో అనుభవం ఉన్న వారితో పాటు కొత్తగా యువకులు నిబంధనలు తెలియక ఇబ్బందులు పడే అవకాశం ఉంది.

అయితే కాబోయే సర్పంచులు కాస్త నిబంధనలు తెలుసుకుని పోటికి దిగడం మంచిదని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ పంచాయతీ రాజ్‌ చట్టం – 2018ని అనుసరించి నిబంధనలు ఇలా..

సర్పంచుగా పోటీ చేయాలంటే..?
సంబంధిత ఓటరు జాబితాలో ఓటరుగా నమోదై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారైతే కుల ధ్రువీకరణ పత్రాన్ని జత చేయాలి. నేర చరిత్ర, స్థిరాస్తులు, అప్పులు, కుటుంబీకుల ఆస్తులు, విద్యార్హత, ఇతరత్రా వివరాలతో కూడిన స్వీయ ప్రకటన (సెల్ఫ్‌ డిక్లరేషన్‌)పై ఇద్దరు సాక్షుల సంతకం ఉండాలి.

ఒక అభ్యర్థి ఒక స్థానానికి నాలుగు నామినేషన్‌ పత్రాల వరకు దాఖలు చేయొచ్చు. ఒకటి కంటే ఎక్కువ స్థానాలకు పోటీ చేస్తే.. నిర్దేశిత గడువులోపు ఒకటి మినహా తక్కిన వాటిని ఉపసంహరించుకోవాలి. లేదంటే అన్నీ తిరస్కరణకు గురవుతాయి. పంచాయతీకి సంబంధించి కుళాయి, ఆస్తి, ఇతరత్రా బకాయిలు ఉండకూడదు. ప్రభుత్వ, పంచాయతీ ఉద్యోగులు, రుణాల ఎగవేతదారు అనర్హులే.

వార్డు సభ్యులుగా పోటీ చేయాలంటే..?
వార్డు సభ్యుడిగా నిలబడే అభ్యర్థి తనకు సంబంధించిన వార్డు కాకుండా మరో వార్డు నుంచి పోటీ చేయాలనుకుంటే ప్రతిపాదకుడు సంబంధిత వార్డు ఓటరు అయి ఉండాలి. రిజర్వేషన్లను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి.

నామినేషన్ కోసం..
మొత్తం ఆరు భాగాలు ఉంటాయి. ప్రధానంగా పార్ట్‌-1లో ప్రతిపాదకుడి వివరాలు, సంతకం, పార్ట్‌-2 అభ్యర్థి డిక్లరేషన్, సంతకం, పార్ట్‌-3 అభ్యర్థి కుల ధ్రువీక్రరణ (గెజిటెడ్‌ అధికారి), సంతకం. పార్ట్‌ – 4, 5, 6 సంబంధించి ఆర్‌వో పూరించి అనుగుణంగా చర్యలు తీసుకుంటారు. ఫామ్‌-3 (నామినేషన్‌ పత్రం), స్వీయ ప్రకటన (అఫిడవిట్‌), ఎన్నికల వ్యయానికి సంబంధించిన డిక్లరేషన్‌ సహా డిపాజిట్‌ సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. ఎన్నికల కోసం ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాను కొత్తగా తెరిచి వివరాలు సమర్పించాలి. ఓటరు, ఆధార్, కుల ధ్రువీకరణ ప్రతులు అవశ్యం.

డిపాజిట్‌ డబ్బులు
జనరల్‌ విభాగంలో సర్పంచి అభ్యర్థి అయితే రూ.2 వేలు, వార్డు సభ్యుడు – రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులైతే.. ఆయా వాటిల్లో 50 శాతం రాయితీ ఉంటుంది. కులధ్రువీకరణ పత్రం తప్పనిసరి.

ఇదికూడా చదవండి…

 

పంచాయతీ రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్లు..!