మళ్లీ.. తొలగింపు లొల్లి..!
– బస్టాండ్ వద్ద డబ్బాల ఏరివేత
– అధికారులను అడ్డుకున్న వ్యాపారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : డ్రైనేజీపై ఏర్పాటు చేసుకున్న డబ్బాల తొలగింపుపై మళ్లీ లొల్లి జరిగింది. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న డబ్బాలను తొలగించేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే.

శుక్రవారం జేసీబీ యంత్రాలతో తొలగించేప్రయత్నం చేశారు. వ్యాపారులు అడ్డుకుని గడువు ఇవ్వాలని కోరారు. శుక్రవారం సాయంత్రం వరకు గడువు ఇచ్చినా వ్యాపారులు ఎలాంటి తొలగింపులు చేసుకోలేదు. దీంతో తిరిగి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు శనివారం ఉదయం మళ్లీ తొలగింపు చర్యలు చేపట్టారు.

ఈ విషయం తెలుసుకున్న వ్యాపారులు అధికారులతో మళ్లీ వాగ్వివాదానికి దిగారు. తొలగింపు చేస్తున్న జేసీబీని అడ్డుకున్నారు. డబ్బాల ముందు నిలబడి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. డబ్బులు పెట్టి నిర్మించుకున్న డబ్బాలను కూల్చివేయొద్దని వేడుకున్నారు. ఇక్కడి నుంచి తొలగించుకునేందుకు సమయం ఇవ్వాలని కోరడంతో నిన్నటి సీన్ మళ్లీ రిపీట్ అయ్యింది. డబ్బాల తొలగింపు కోసం అధికారులు వ్యాపారులకు కొంత సమయం ఇచ్చారు.


