కుల గణనతో బీసీలకు సంపూర్ణ న్యాయం
– సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ తీర్పు హర్షనీయం
– జన గణనలో కుల గణనను పూర్తి చేయాలి
– బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : కుల గణనతోనే బీసీలకు సంపూర్ణ న్యాయం జరుగుతుందని, కుల గణనను అనుకూలంగా సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ తీర్పు ఇవ్వడం హర్షణీయమని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ అన్నారు.

కుల గణనపై సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడం పట్ల గురువారం ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. కుల గణన వ్యతిరేకులకు సుప్రీం కోర్టు తీర్పు చెంపపెట్టులాంటిదని ఆయన వ్యాఖ్యానించారు. రాజ్యాంగ స్పూర్తికి అనుగుణంగా సామాజిక న్యాయం సాధించే దిశగా సుప్రీం కోర్టు తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకమని అన్నారు.

సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ తీర్పు దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమాలకు కొత్త ఊపు తీసుకువచ్చిందని ఆయన అన్నారు. ఇప్పటి వరకు బీసీల అసలైన జనాభా లెక్కలు బయటకు రాకపోవడం వల్ల విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం, సంక్షేమ పథకాల విషయంలో బీసీలు అనేక అన్యాయాలకు గురయ్యారని తెలిపారు. కుల గణనతోనే బీసీలకు సంపూర్ణ న్యాయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

దేశంలో బీసీల సామాజిక, ఆర్థిక, విద్యా పరిస్థితులపై ఖచ్చితమైన గణాంకాలు సేకరించడం అత్యంత అవసరమని అన్నారు. కుల గణన ద్వారా వాస్తవ పరిస్థితులు వెలుగులోకి వస్తేనే ప్రభుత్వాలు బీసీలకు తగిన విధానాలు, అవకాశాలు, రిజర్వేషన్లు కల్పించే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. జనగణనలో సమగ్ర కుల గణన తప్పనిసరిగా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కందుకూరి రాజ్కుమార్ డిమాండ్ చేశారు.


