పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం
– పట్టణ పరిశుభ్రతలతో వారి సేవలు కీలకం
– చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్రెడ్డి
– కార్మికులకు నిత్యవసర వస్తువుల పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతోందని తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి అన్నారు.

శనివారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు ఈ ఏడాదికి సంబంధించిన నిత్యావసర వస్తువులు, కన్జర్వెన్సీ మెటీరియల్ను పంపిణీ చేశారు. బట్టలు, చెప్పులు, ఆయిల్, సబ్బులు, చీపుర్లు, పనిముట్లతో పాటు పారిశుద్ధ్య నిర్వహణకు అవసరమైన వివిధ సామగ్రిని చైర్ పర్సన్ నీరజా బాల్రెడ్డి చేతుల మీదుగా అందజేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు కీలకమని చైర్పర్సన్ పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఒకరోజు సెలవును పారిశుద్ధ్య కార్మికులు తప్పనిసరిగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ రాకేష్ రెడ్డికి చైర్పర్సన్ సూచించారు.

ముఖ్యంగా పండుగలు, పర్వదినాల్లో మహిళా పారిశుద్ధ్య కార్మికులపై పని భారం పెరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, కమిషనర్ రాకేష్ రెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.


