కొండచిలువల ట్రాఫిక్ కోచింగ్..!
– ట్రాఫిక్ ఉల్లంఘనులకు కనువిప్పు
– రోడ్డెక్కిన కొండ చిలువల వీడియో వైరల్
దర్శని డెస్క్: మనుషులెవరైనా పద్దతులు మరిచిన కొన్ని జంతవులు, ప్రాణులు వాటి ధర్మాన్ని మరిచిపోవు. చాలా సందర్భాలలో వాటి ధర్మాన్ని కొనసాగిస్తూ మనుషులకు కనువిప్పు కలిగిస్తుంటాయి. అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనల వీడియోలను ఇంటర్నెట్లో పోస్టు చేసి అవి వైరల్ అయి పోతూ మనుషులను చైతన్య పరుస్తాయి. అలాంటి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రోడ్డుపైకి వచ్చిన రెండు కొండచిలువలు ట్రాఫిక్ రూల్ అందరు పాటించాల్సిందేనంటు సందేశాన్ని ఇచ్చాయి.
అడవులు, చెట్లు పుట్టలు కనుమరుగవుతున్న వేళ..జంతువులు, విష సర్పాలు జనావాసాల్లోకి వచ్చి చేరుతున్నాయి. అలా హనుమకొండ జిల్లాకు 26 కి.మీ దూరంలో ఉన్న శాయంపేట మండలం మాందారిపేటగుట్టలో జాతీయ రహదారిపై రెండు కొండచిలువలు రోడ్డెక్కిన వైనం ఆసక్తిగా మారింది. జాతీయ రహదారిపై ఈ దృశ్యం ఆశ్చర్య పరిచింది. రోడ్డెక్కిన కొండచిలువలు రోడ్డుపై అడ్డదిడ్డంగా పాకుతూ పోకుండా రోడ్డు సైడ్ న పద్ధతిగా ఒకదాని వెనుక ఒకటి పాకుతూ పోవడం చూసి వాహనదారులు, ప్రయాణికులు ఆశ్చర్య పోయారు. ఇవి కూడా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నాయా ఏంటీ.. అనుకుంటూ నోరెళ్లబెట్టారు. పాపం వాటికి కూడా ట్రాఫిక్ రూల్స్ తప్పలేదు. దాంతో ఎలా వెళ్తున్నాయో చూడండి. అప్పుడప్పుడు జ్ఞానం ఉన్న మనుషులే రోడ్డుపై అస్తవ్యస్తంగా ప్రయాణిస్తూ అనేక చిక్కుల్లో పడుతుంటారు. మూగజీవాలైన కొండచిలువలు ఇలా క్రమ పద్ధతిలో రోడ్డుపై పాకడంతో స్థానికులంతా ఆసక్తిగా చూశారు. కొండచిలువలు ఇచ్చిన ట్రాఫిక్ కోచింగ్ ఇస్తున్నట్లుగా ఉన్న వీడీయోతో అయినా మారుతారేమో చూద్దాం.
