పట్టా పాసుపుస్తకాల కోసం ఆత్మహత్యాయత్నం
– యాదాద్రి జిల్లా కలెక్టరేట్ వద్ద కలకలం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: పట్టా పాసుపుస్తకాల కోసం ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన యాదాద్రి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద చోటు చేసుకుంది. జిల్లాలో ఈ సంఘటన కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకలో మహేష్ అనే వ్యక్తి తండ్రి ఉప్పలయ్య 20 ఏళ్ల క్రితం 4 ఎకరాల భూమిని ఆరు వేల రూపాయలకు కొనుగోలు చేశారు. అయితే ఇందుకు సంబంధించిన పాసు పుస్తకాలు ఇచ్చేందుకు రెవిన్యూ అధికారులు రోజుల తరబడి తిప్పించుకుంటున్నారని మహేష్ ఆరోపించాడు.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురై మహేష్ సోమవారం జిల్లా కలెక్టర్ చాంబర్ వద్దకు చేరుకుని ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కలెక్టరేట్ సిబ్బంది అప్రమత్తమై అతన్ని అడ్డుకుని స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించారు. తన భూ సమస్య పరిష్కరించడంతో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదనతో ఈ దారుణానికి ఒడిగట్లు తెలిపాడు. ప్రస్తుతం మహేష్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. మరోవైపు ఈ సంఘటనపై జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. బాధితుడికి పాసు పుస్తకాలు జారీ చేసేందుకు హామీ ఇచ్చారు. రైతులు ఎమైనా సమస్యలు ఉంటే జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల దృష్టికి తీసుకరవాలన్నారు. మహేష్ సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
