అద్దంలా అంతారం రోడ్డు..!
– గుంతల రోడ్డుకు మెరుగులు
– ప్రయాణం ఇక సాఫీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఒకప్పుడు గతుకుల రోడ్డుగా ఉన్న తాండూరు – అంతారం రోడ్డు అద్దంగా మారింది. రోడ్డుపై గుంతలు తొలగిపోవడంతో ప్రయాణాలు సాఫీగా సాగుతున్నాయి. గతంలో రోడ్డుపై ఏర్పడ్డ గుంతలతో తాండూరు – అంతారం మార్గంలో ప్రయాణం నరకప్రాయంగా సాగేది. రోడ్డును భాగుచేయాలని ప్రతిపక్షాలు, పౌరులు వివిధ రకాలుగా నిరసనలు తెలిపారు. తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్పందించి గత యేడాదిలో అంతారం రోడ్డు మరమ్మత్తుల కోసం డీఎంఎఫ్టీ నుంచి రూ. 1 కోటి నిధులు మంజూరు చేయించారు. మరమ్మత్తులకు ఇబ్బందులు ఏర్పడినా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపించి పనులు పూర్తయ్యేలా దృష్టిసారించారు. గత కొన్ని రోజుల క్రితమే పనులు జరగడంతో రోడ్డు అందుబాటులోకి వచ్చింది. దీంతో అంతారం, ఎన్టీఆర్ నగర్, విజయనగర్ కాలనీ వాసులతో పాటు ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తూ రోడ్డు పనులు పూర్తి చేయించినట్లు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

