ఎన్నాళ్లకెన్నాళ్లుకు..!
– జిల్లా ఆసుపత్రిలో సిటీ స్కాన్ సేవలు
– నేటి నుంచి ప్రారంభం
– జెడ్పి చైర్ పర్సన్, జిల్లా కలెక్టర్ల ప్రత్యేక చొరవ
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో సిటీ స్కాన్ సేవలు నేటి నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి. గత మూడేళ్లుగా ఆగిపోయిన సేవలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. గత ఏండ్ల క్రితం జిల్లా ఆసుపత్రిలో సీటిస్కాన్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. అప్పటి నుంచి సేవలందించిన సిటిస్కాన్ మిషన్ కాలపరిమితి దాటిపోవడంతో తరుచూ మరమ్మత్తులకు గురైంది. దీంతో మూడేళ్లుగా ఆసుపత్రిలో సిటి స్కాన్ సేవలు స్థంభించాయి. పరీక్షల కోసం వచ్చే రోగులకు, బాధితులకు ఇబ్బందులు తప్పలేదు. ప్రజల నుంచి వస్తున్న
విజ్ఞప్తుల మేరకు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునితా మహేందర్రెడ్డి, జిల్లా కలెక్టర్ పౌసుమి బసులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. విమానాలు తయారు చేసే బోయింగ్ కంపెనీ ద్వారా ప్రభుత్వం జిల్లా ఆసుపత్రికి సిటి స్కాన్ మిషన్ను మంజూరు చేసింది. రూ. 1.50 కోట్లతో బోయింగ్ కంపెని సిటిస్కాన్ మిషన్ను విరాళంగా అందించింది. స్వాతంత్ర్య దినోత్సవంకు ముందు జిల్లా ఆసుపత్రికి చేరిన సిటి స్కాన్ మిషన్కు ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ మల్లికార్జున స్వామి ఆధ్వర్యంలో అన్ని ఆపరేటింగ్ పనులు పూర్తయ్యాయి. ఈ మేరకు మంగళవారం వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునితామహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి, జిల్లా కలెక్టర్ పౌసుమి బసుల సమక్షంలో సిటి స్కాన్ మిషన్ను ప్రారంభించబోతున్నారు. దీంతో ఏండ్లుగా ఎదురుచూస్తున్న సిటి స్కాన్ సేవలు నేటి నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి.
