దళితుల స్వయం ఉపాధికి పెద్దపీట
– దళితబంధును సద్వినియోగం చేసుకోవాలి
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: రాష్ట్రంలోని దళితుల స్వయం ఉపాధికి పెద్దపీట వేస్తూ సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశ పెట్టారని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. తాండూరు మండలం కరణ్ కోట్ గ్రామానికి చెందిన శివ అనే లబ్దిదారునికి దళితబంధు కింద కారు మంజూరైంది. శనివారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి లబ్దిదారునికి కారు తాళం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దళితుల సాధికారత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దళితబంధును ప్రవేశ పెట్టిందన్నారు. అర్హులైన దళితులకు రూ. 10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ వారి స్వయం ఉపాధికి పెద్దపీట వేసిందన్నారు. తమ అభివృద్ధిని తామే నిర్వచించుకునే దిశగా చైతన్యమై.. ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు సాయిరెడ్డి,అంతారం సర్పంచ్ రాముల, కరణ్ కోట్ ఉప సర్పంచ్ హేమంత్, రైతు సమన్వయ సమితి కోఆర్డీనేటర్ రాంలింగారెడ్డి, టీఆర్ఎస్ మహిళ నాయకురాలు శకుంతల, టీఆర్ఎస్ కేవి అధ్యక్షులు కె. గోపాల్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

