ఆర్ఎంసీ టోర్నమెంట్ విజేతగా టీసీసీ టీం
– రన్నర్గా నిలించిన పర్ష్యాపూర్ తాండా యువకులు
– ఫైనల్ మ్యాచ్ను ప్రారంభించిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– 7న విజేత జట్లకు నగదు, ట్రోఫీల అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి : రోహితన్న మెగా క్రికెట్ టోర్నమెంట్(ఆర్ఎంసీ) విజేతగా విజేతగా తాండూరు సిటిజన్ కౌన్సిల్(టీసీసీ) టీం నిలిచింది. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి జన్మదినం సందర్భంగా గత 10 రోజులుగా 22 మైదానాలలో దాదాపు 4 వేల మంది క్రీడాకారులతో రోహితన్న మెగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఫైనల్ మ్యాచ్ నిర్వహించారు. తాండూరు సిటిజన్ కౌన్సిల్ టీం, పర్ష్యానాయక్ తాండా యువకుల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ పోటీని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మైదానానికి చేరుకుని టాస్ వేసి మ్యాచ్ను ప్రారంభించారు. అనంతరం క్రీడా కారుల మధ్య కొనసాగిన మ్యాచ్ను ఎమ్మెల్యే ఆసక్తిగా తిలకించారు.
చివరకు ఫైనల్ మ్యాచ్లో తాండూరు సిటిజన్ కౌన్సిల్ టీం విజేతగా నిలవగా పర్ష్యానాయక్ తాండా యువకులు రన్నర్ గా నిలిచారు. ఈనెల 7న విలియమూన్ మైదానంలో జరిగే కార్యక్రమంలో విజేత జట్టుకు రూ. 1లక్ష, రన్నర్ జట్టుకు రూ. 50వేల బహుమతి అందించడం జరుగుతుందని నిర్వహకులు పేర్కొన్నారు. ఇతర జట్లకు కూడ నగదు బహుమతులు ఉంటాయని, వీటిని ఎమ్మెల్యే చేతుల మీదుగా అందిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), నాయకులు పట్లోళ్ల నర్సింలు, రాజుగౌడ్, పెద్దేముల్, తాండూరు మండలాల అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, రాందాస్ తదితరులు ఉన్నారు.


