అవన్నీ అబద్దపు రూమర్సే..!

తాండూరు తెలంగాణ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్

అవన్నీ అబద్దపు రూమర్సే..!
– పార్టీ మారే ప్రసక్తే లేదు
– ఎమ్మెల్యే తోపుడు వివాదం రాద్దాంతమే
– 15 రోజుల్లో ప్రజా క్షేత్రంలోకి వస్తా
– ఆ తరువాత పల్లె పల్లెకు పట్నం
– పుకార్లపై క్లారీటి ఇచ్చిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తనను రాజకీయంగా ఎదుర్కొన లేక లేని పోని అబద్దపు రూమర్స్ సృష్టిస్తున్నారని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరుతున్నారని వస్తున్న పుకార్లతో పాటు భద్రేశ్వర జాతర ఉత్సవాలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేతితో తోశారనే రాద్దాంతాలకు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి చెక్ పెట్టారు. మంగళవారం తాండూరుకు వచ్చిన ఎంపీ రంజిత్ రెడ్డి సమక్షంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తనపై వస్తున్న పుకార్లు, రాద్దాంతాలను కొట్టిపారేశారు. కావాలనే కొంతమంది మీడియాలో రాతలు రాయిస్తున్నారని విమర్శించారు. ఈ విషయంపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసి వివరించడం జరిగిందన్నారు. బీఆర్ఎస్ పార్టీలో రాష్ట్ర మాజీ మంత్రిగా, జిల్లాలో సీనీయర్ నేతగా ఉన్నానని చెప్పుకొచ్చారు. ఉమ్మడి రంగారెడ్డితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. అదే గుర్తించే సీఎం కేసీఆర్ నాగర్‌ కర్నూల్‌ జిల్లాకు ఇంచార్జ్‌గా నియమించారని, బాధ్యతలలో ఉండడం పట్ల తాండూరుకు సమయం కేటాయించడంలో స్వల్ప ఇబ్బందులు వచ్చినప్పటికి స్థానిక నేతలు, కార్యకర్తలతో టచ్‌లో ఉంటున్నామన్నారు. ఇదే అవకాశంగా తీసుకుని కొందరు బీజేపీలో చేరుతున్నట్లు పుకార్లు సృష్టించారని అన్నారు. తనకు బీజేపీతో, ఆ పార్టీ నేతలతో సంబంధం లేదన్నారు. వచ్చే 15 రోజుల్లో మళ్లీ స్థానిక నేతలు, కార్యకర్తలతో మమేకమవుతామన్నారు. అదేవిధంగా మే 25 నుంచి పల్లె పల్లెకు పట్నం కార్యక్రమం చేపడుతామని, గ్రామ గ్రామాన పర్యటిస్తామన్నారు.

తోపుడుపై కూడ రాద్దాంతం
మరోవైపు భద్రేశ్వర జాతర ఉత్సవాలలో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తనపై చేతితో తోశారని సోషల్ మీడియాలో రాద్దాంతం చేశారని అన్నారు. నిజానికి అలాంటిదేమి జరగలేదన్నారు. హరతి ఇచ్చే సమయంలో తోపులాట జరిగిందని, ఎలా తోస్తున్నారో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తనకు చూపించారని అన్నారు. అ విషయాన్ని కొందరు వివాదంగా మార్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనీయర్ నాయకులు కరణం పురుషోత్తంరావు, పట్టణ మాజీ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్‌ తదితరులు ఉన్నారు.