తెలియక చేసిన తప్పు..!
– మోబైల్ ఫోన్లో ఓటరు దరఖాస్తు
– 83 మందికి ఒకే తండ్రి ఓకే పేరుతో జాబితా
– తాండూరు నియోజకవర్గంలో వెలుగులో ఘటన
– విచారణలో తేలిన విషయాలేంటంటే..?
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ఓ వ్యక్తి తెలియక చేసిన తప్పు వివాదాస్సమైంది. మోబైల్ యాప్ లో చేసిన ఓటరు దరఖాస్తు అధికారులకు చిక్కులు తెచ్చిపెట్టింది. కొన్ని నెలలుగా మోబైల్ ఫోన్లో ఓటరు దరఖాస్తు చేసిన వ్యక్తి పేరే తండ్రి, భర్త స్థానంలో ప్రత్యక్షం కావడంతో చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటన తండూరు మండలం మేజర్ గ్రామ పంచాయతీ కరణ్ కోట్ గ్రామంలో వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పెన్నా సిమెంట్ కర్మాగారంలో కాంట్రాక్టు లేబర్గా పనిచేస్తున్న సిర్రా హన్మంతు అనే వ్యక్తి గత కొన్ని నెలలుగా తన వద్ద ఉన్న మోబైల్ ఫోన్లో ఓటరు నమోదు చేస్తున్నారు.
కరణ్ కోట్ గ్రామ పంచాయతీకి చెందిన పలువురు ఓటర్ల వివరాలను కూడా ఎలక్షన్ యాప్ ద్వారా దరఖాస్తు చేశారు. అయితే దరఖాస్తు చేసే క్రమంలో తండ్రి లేదా భర్త స్థానంలో సంబంధికుల పేర్లు నమోదు చేయకుండా వదిలేశాడు. ఇటీవల విడుదల చేసిన ఓటర్ల జాబితాలో దాదాపు 83 మంది ఓటర్లకు తండ్రి, భర్త స్థానంలో సిర్రా హన్మంతు పేరు ప్రత్యక్షం అయ్యింది. దీంతో ఓటర్ల నమోదు వివాదాస్పదమయ్యింది. గమనించిన ఎంపీటీసీ రాజ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు జర్నప్ప తాండూరు తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు సమక్షంలో మాజీ ఎంపీపీ శరణు బసప్ప, ఎంపీటీసీ రాజ్ కుమార్, ఉపసర్పంచ్ హేమంత్ కుమార్, బీఎల్దలతో కలిసి కరణ్ కోట్ గ్రామ పంచాయితీలో విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఓట్లు నమోదు చేసిన సిర్రా హన్మంతు మోబైల్ యాప్లో తనకు తెలియక నమోదు చేసినట్లు తప్పుకు అంగీకరించి రాతపూర్వకంగా వివరణ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆర్డీఓ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ సాంకేతిక కారణంగా ఓటర్ల నమోదులో తప్పు జరిగిందని తెలిపారు. ఇందులో అనర్హులను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విచారణలో తాండూరు తహసీల్దార్ తారాసింగ్, డీఏఓ మహేష్ గౌడ్, ఆర్ఐ రాజురెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

