నిమిషం ఆలస్యమైన అనుమతి రద్దు
– ఇంటర్మీడియట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
– పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
– వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: ఈనెల 25 నుండి నవంబర్ 2 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల ఒక్క నిమిషం నిబంధన యధావిధిగా అమలు చేయాలని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లా అదనపు కలెక్టర్ అధ్యక్షతన ఇంటర్ బోర్డు జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మోతిలాల్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈనెల 25 నుండి నవంబర్, 2 వరకు జరుగనున్న పరీక్షలకు విద్యార్థులు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన అనుమతించబడదని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అనులుపర్చడం జరుగుతుందని తెలిపారు. పరీక్ష కేంద్రాల పరిసరాలలో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని సూచించారు. అదేవిధంగా తహసీల్దార్లు, ఆర్డీఓలతో ఫ్లయింగ్ స్వ్కార్డు బృందాలు ఏర్పాటు చేసి పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి సెంటర్ వద్ద వైద్య శాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపుల ఏర్పాటు, అంతరాయం లేకుండా విద్యుత్స సరఫరా చేయాలని సంబంధిత అధికారులను కోరారు. పరీక్ష సమయంలో విద్యార్థులకు ఇబ్బందులు
కలుగకుండా ఆర్టీసీ బస్సులు సకాలంలో నడపాలని, పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు త్రాగు నీటి సదుపాయం కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో ఇంటర్మీడియట్ విద్యా నోడల్ అధికారి శంకర్ నాయక్, వికారాబాద్ ఆర్డీఓ ఉపేందర్ రెడ్డి, జిల్లా వైద్య శాఖ అధికారి తుకారం, డీఎస్పీ సత్యనారాయణ, విద్యాశాఖ సహాయ సంచాలకులు అబ్దుల్ గని, ఆర్టీసీ డీవీఎం రమేష్ తదితరులు పాల్గొన్నారు.
