పిల్లల ఆరోగ్యం పట్ల అశ్రద్ధ తగదు..!
– బాధ్యతగా నాణ్యమైన భోజనం అందించాలి
– ఎస్టీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎ. శరత్
– జిల్లా కలెక్టర్తో కలిసి ట్రైబల్ గర్ల్స్ హాస్టల్ తనిఖీ
– అది ఫుడ్ పాయిజన్ కాకపోవచ్చన్న జిల్లా కలెక్టర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : వసతి గృహాల్లో విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, బాధ్యతగా విధులు నిర్వర్తించాలని తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ ఏ. శరత్ అన్నారు. బుధవారం తాండూరు పట్టణం సాయిపూర్లోని గిరిజన బాలికల సంక్షేమ పాఠశాల, వసతి గృహాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ శరత్ వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తో కలిసి అకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలోని బాలికలు అస్వస్థతకు గురైన సంఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ శరత్ వసతి గృహాన్ని సందర్శించారు. అస్వస్థతకు గురైన విద్యార్థినిలతో మాట్లాడారు. ఫుడ్ పాయిజన్ అంటూ వచ్చిన ఆరోపణలపై ఆరా తీశారు.
హాస్టల్ వార్డెన్, నిర్వహకులతో జరిగిన సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. వంటగది, స్టోర్ రూంలను పరిశీలించి.. సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. పిల్లల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకుండా బాధ్యతగా ఉండాలని వార్డెన్, నిర్వహకులను సూచించారు. విధుల్లో ఆశ్రద్ధ వహించకుండా బాధ్యతగా మెను ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. హాస్టల్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ హాస్టల్ లో జరిగిన సంఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నామన్నారు. మంచినీటి ద్వారా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉండడంతో తాగునీటిని పరిశీలించేందుకు 12 వేల హెచ్ుఎస్ టెస్ట్ వైల్ కొనుగోలు చేయడం జరిగిందని ప్రిన్సిపల్ సెక్రటరీ శరత్ దృష్టికి తెచ్చారు.
దీని ద్వారా తాగునీటిలో బ్యాక్టీరీయాను గుర్తించే అవకాశం ఉంటుందని తెలిపారు. అనంతరం వసతి గృహా విద్యార్థులతో కలిసి ప్రిన్సిపల్ సెక్రటరీ శరత్, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అధికారులు మధ్యాహ్న భోజనం చేశారు.
ఫుడ్ పాయిజన్ కాకపోవచ్చు: జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
తాండూరులోని వసతి గృహ సంఘటనపై సమ్రగంగా పరిశీలన చేస్తున్నామని కలెక్టర్ ప్రతీక్ జైన్ మీడియాతో పేర్కొన్నారు. విద్యార్థినిలు కేవలం ఫుడ్ పాయిజన్ వల్లే అనారోగ్యానికి గురికాలేదని అనుమానాలు ఉన్నాయని, ఈ మేరకు హాస్టల్లోని మంచినీటి పరీక్షలు జరిపిస్తున్నామన్నారు. విద్యార్థులు భోజనం చేసిన అన్నం సరిగ్గా ఉడకక పోవడంతో కడుపునొప్పి సమస్యలు వచ్చినట్లు అంచనాకు వచ్చామన్నారు.
దీనిపై సమగ్రంగా పరిశీలన జరిపి బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. అదేవిధంగా వసతి గృహంలో ఉదయం నుంచి వైద్యుల పర్యవేక్షణలో బాధిత బాలికలకు వైద్య సేవలను అందించడం జరుగుతుందన్నారు. మరోవైపు జిల్లాలోని అన్ని వసతి గృహాల్లో తాగునీటి పరీక్షలు చేయించేందుకు రూ. 1 లక్షతో 10వేల హెచ్తుఎస్ వైల్ లను కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు తహసీల్దార్ తారాసింగ్, జిల్లా ఎస్టీ వెల్ఫేర్ ఆఫీసర్. పలు శాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు.
ఇదికూడా చదవండి…

