
తాండూరులో ఘనంగా ఫోటోగ్రఫీ దినోత్సవం
– సృష్టికర్త లూయిస్ డాగ్యూరే చిత్రపటానికి నివాళులు
– అన్నదానం, పలు సేవా కార్యక్రమాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. బుధవారం తాండూరు ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ సృష్టికర్త లూయిస్ డాగ్యూరే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం అన్నదానం, సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. ఫోటోగ్రఫీ కేవలం వృత్తి మాత్రమే కాదని, సమాజంలో జరిగే కీలక సంఘటనలు, మధుర జ్ఞాపకాలను భద్రపరిచే కళ అని అన్నారు. ఫోటోగ్రఫీని వృత్తిగా ఎంచుకున్న యువతకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు.

ఆధునిక కెమెరాలు, కంప్యూటర్లు, ఎడిటింగ్ పరికరాల కొనుగోలుకు సబ్సిడీ రుణాలు, శిక్షణ, స్వయం ఉపాధి పథకాల ద్వారా సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఫోటోగ్రాఫర్ల ఆర్థిక స్వావలంబనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.

కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు నరేష్, ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్, సీనియర్ ఫోటోగ్రాఫర్ శరణ్ బసవేశ్వర్, షాబుద్దీన్, వీరన్న, నాగప్ప, శివ, వీరరాజు, అంజి, శ్రీనివాస్, శరత్ తదితరులు పాల్గొన్నారు.

