రంజాన్లో సర్వమత సారం
– మత సామరస్యతకు ఇఫ్తార్ ప్రతిక
– చేవేళ్ల ఎంపి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
– తాండూరులో ఎమ్మెల్సీ ఇఫ్తార్ విందు
తాండూరు, దర్శిని ప్రతినిధి: ముస్లింల పవిత్ర పండగ రంజాన్లో సర్వమత సారం వెల్లి విరుస్తోందని, సామరస్యతకు ఇఫ్తార్ విందులు ప్రతీకగా నిలుస్తాయని చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిలు అన్నారు. రంజాన్ పండగను పురస్కరించుకుని మంగళవారం ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. పట్టణంలోని క్లాసిక్ గార్డెన్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు చేవేళ్ల ఎంపి రంజిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎంపి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిలు ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస దీక్షలను విరమింప జేశారు. ఈ క్రమంలో మైనార్టీ నేతలు, ముస్లిం సోదరులు ఎంపి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిలకు ఫలహారాలు తినిపించారు.
ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ ముస్లింలు పవిత్రంగా జరుపుకునే రంజాన్ మాసంలో సర్వమత సారం చాటుతోందన్నారు. ఇందులో భాగంగా అందించే ఇఫ్తార్ విందులు మతసామరస్యతకు ప్రతీకగా నిలుస్తాయన్నారు. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ అల్లా కృపతో ముస్లిం సోదరులు అంతా రంజాన్ పండగను సంతోషంగా జరుపుకోవాలన్నారు. మైనార్టీల సంక్షేమానికి, అభ్యున్నతికి తనవంతు తోడ్పాటు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనీయర్ నాయకులు కరణం పురుషోత్తంరావు, మాజీ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, ఎంఐఎం పట్టణ అధ్యక్షులు హాది, మైనార్టీ నాయకులు, ముస్లిం వెల్పేర్ అసోసియేషన్ ప్రతినిధులు, రాజకీయ, సంఘాల నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గన్నారు.

