తాపీగా వచ్చాడు.. స్టైల్గా వెళ్లాడు..!
– మిత్రానగర్ దొంగ రూటే వేరు
– పట్ట పగలే తాళం వేసిన ఇంటికి కన్నం
– తాండూరులో హాట్ టాపికైన చోరీ సీన్
తాండూరు, దర్శిని ప్రతినిధి : దొంగలు ఎవరైనా చోరీ చేయాలనుకునే ఇంటిని పరిశీలించి టార్గెట్ చేస్తారు. హడావుడిగా దొంగతనం చేసి అక్కడి నుంచి క్షణాల్లో పరారవుతారు. కానీ ఈ దొంగ మాత్రం కన్నం వేయాల్సిన ఇంటి ముందుకు వచ్చినా తాపీగా సిగరెట్ తాగిన తరువాత చోరీ చేశాడు. పైగా అక్కడి నుంచి స్టైల్గా హిరోలాగా వెళ్లిపోయాడు. సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలు వాట్సాప్లో వైరల్ కావడంతో వికారాబాద్ జిల్లా తాండూరులో హాట్ టాపిక్గా మారింది. వివరాల్లోకి వెళితే…
పట్టణంలోని మిత్రానగర్కు చెందిన కాశమ్మ ఆర్టీసీలో కాంట్రాక్టు ద్వారా పనిచేస్తుంది. శనివారం ఆమె ఇంటికి తాళం వేసి విధులకు వెళ్లింది. మళ్లీ వచ్చే చూసే సరికి ఇంటి తాళం, ఇంట్లో బీరువాలో వస్తువులు చిందర వందరగా కనిపించాయి. అప్పటికే ఇంట్లో ఉన్న సుమారు రూ. 30వేలు, 3 తులాల బంగారం ఆపహరణకు గురైనట్లు బాధితురాలు కాశమ్మ తెలిపింది. చోరీ సంఘటనపై సీసీ కెమెరాలతో పరిశీలించగా ఓ వ్యక్తి ఇంటి మెట్ల ముందు సిగరెట్ తాగినట్లు, తరువాత తాపీగా ఇంట్లో చోరీ చేసినట్లు తెలుస్తోంది. పైగా చోరీ జరిగిన తరువాత దొంగ స్టైల్గా నడుచుకుంటూ వెళ్లడం కనిపించింది. ఈ సంఘటన తాండూరులో చర్చనీయాంశంగా మారింది.
ఇదికూడా చదవండి…

