నాలుగు రోజులు వ్యాక్సీనేషన్ బంద్
– వైద్య సిబ్బందికి దసరా విరామం
– తిరిగి సోమవారం నుంచి టీకాల పంపిణీ
ఉమ్మడి రంగారెడ్డి, దర్శిని ప్రతినిధి: జిల్లాలో జోరుగా కొనసాగుతున్న వ్యాక్సీనేషన్ పంపిణీకి బ్రేక్ పడింది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు వ్యాక్సీనేషన్ పంపిణీ బంద్ కాబోతుంది. అత్యంత వైభవంగా జరుపుకునే దసరా పండగకు విరామం ఇవ్వాలని వైద్య సిబ్బంది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు విజ్ఞప్తి చేసుకున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ వ్యాక్సీనేషన్ పంపిణీలో ఉన్న వైద్య సిబ్బందికి సెలవు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో నేడు గురువారం, రేపు శుక్రవారం, ఎల్లుండి శనివారం, తరువాతి రోజు ఆదివారం వరకు వ్యాక్సీనేషన్ పంపిణీకి విరామం ఇస్తున్నట్లు ప్రభుత్వ కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తిరిగి సోమవారం టీకాల పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందని ప్రకటించారు. ఈ రోజుల్లో ఎక్కడా వ్యాక్సీనేషన్ పంపిణీ జరగదని, దీనిని అందరు దృష్టిలో ఉంచుకోవాలని జిల్లా వైద్యాధికారులు సూచించారు. గత ఎనిమిది మాసాలుగా వ్యాక్సీనేషన్ పంపిణీలో ఉన్న వైద్య సిబ్బందికి విరామం ప్రకటించడంతో ఊరట చెందారు.
