తాండూరు అభివృద్ధే టీడీఎఫ్ లక్ష్యం
– కాలుష్యం, రోడ్ల బాగుకోసం పోరాటం
– మెడికల్ కళాశాల సాధనకు ఉద్యమం
– మీడియా సమావేశంలో ఫోరం ప్రతినిధులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు అభివృద్ధే లక్ష్యంగా తాండూరు డెవలప్మెంట్ ఫోరం(టీడీఎఫ్) కృషి చేస్తుందని ఫోరం ప్రతినిధులు పేర్కొన్నారు. ఆదివారం తాండూరు పట్టణంలోని శాంతినగర్ అలియా మజీద్ కాంప్లెక్స్ ఫోరం ప్రతినిధులు కమల్ అతహర్, గోపాలకృష్ణ, పర్యాద రామకృష్ణ, వెంకటేశం(వాసు) తదితరులు మీడియాతో మాట్లాడారు. తాండూరులో ఆధ్వాన్న రోడ్ల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. దేశ రాజధాని ఢిల్లీ కంటే తాండూరులో 6.22 మైక్రాన్ల కాలుష్యం నమోదు కావడం తీవ్ర ఆందోళన కలిగించే అంశమన్నారు. అదేవిధంగా గత కొన్నేండ్లుగా తాండూరులో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలనే డిమాండ్ ప్రజల్లో ఉందన్నారు. తాండూరులో నెలకొన్న రోడ్లు, కాలుష్యం, మెడికల్ కళాశాల సాధన కోసం తాండూరు డెవలప్ మెంట్ ఫోరం నిస్వార్థంగా పోరాటం చేస్తుందని, ఇందులో ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు లేవని పేర్కొన్నారు. అయితే శనివారం తాండూరులో జరిగిన రిలే దీక్షను అడ్డుకోవడాన్ని తప్పుపట్టారు. ధర్నా విరమించేందుకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మరోసారి అసత్య హామిలను ఇచ్చారని విమర్శించారు. ఏదేమైనా టీడీఎఫ్ ఆధ్వర్యంలో తాండూరులో అధ్వాన్నంగా మారిన రోడ్ల బాగుతో పాటు తాండూరులో పెరిగిన కాలుష్య నియంత్రణకు పోరాడుతామన్నారు. దీంతో పాటు తాండూరులో మెడికల్ కళాశాల సాధనకు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకవచ్చి ఉద్యమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఫోరం ప్రతినిధులు సోయబ్. మధుసూదన్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

