హంగామా రాజకీయాలు వద్దు..!
– బీఆర్ఎస్ కార్యక్రమంలో అసభ్య నినాదాలు సరికాదు
– మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్పందించి.. ఖండించాలి
– కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి, న్యాయవాది కె. గోపాల్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో హంగామా రాజకీయాలు చేయడం సరికాదని కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధికార ప్రతినిధి, న్యాయవాది కె. గోపాల్ అన్నారు.

మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి రాక సందర్భంగా సోమవారం నిర్వహించిన బీఆర్ఎస్ ర్యాలీలో ఎమ్మెల్యే మనోహర్రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను ఉద్దేశించి అసభ్య నినాదాలు, అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యానికి మచ్చ అని విమర్శించారు.

ర్యాలీలో అభ్యంతరకర వ్యాఖ్యలు వినిపించినా రోహిత్రెడ్డి ఖండించకపోవడం సరికాదన్నారు. యువజన నాయకుడు అనిల్బాండ్ చేసినట్లు ఆరోపిస్తున్న వ్యాఖ్యలను స్పష్టంగా ఖండించి, ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ తాండూరు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘తాండూరుకు హంగామా రాజకీయాలు అవసరం లేదు.. అభివృద్ధి రాజకీయాలే కావాలి అని అన్నారు.

బీఆర్ఎస్ పాలనలో తాండూరుకు వచ్చిన నిధులు, చేపట్టిన అభివృద్ధి పనులు.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే మనోహర్రెడ్డి ఆధ్వర్యంలో వచ్చిన నిధులు, కొనసాగుతున్న పనులపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ఎవరు అభివృద్ధిని ఎజెండాగా ముందుకు తీసుకెళ్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా తీర్పు చెబుతారని పేర్కొన్నారు.


