ఓటర్ల జాబితాలో భారీ మార్పులు..!
– తెలంగాణలో ‘సర్’ ముసాయిదా విడుదల..
– 92 లక్షల మందికి నోటీసులు..
– 73 లక్షల మంది ఏఎస్డీ జాబితాలోకి
– మీ ఓటు ఉందో లేదో తెలుసుకోండి
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ఓటర్ల జాబితాలో కీలక మార్పులు జరుగబోతుండడం ఖాయంగా కనిపిస్తోంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR-2026)లో భాగంగా ముసాయిదా జాబితా విడుదలైంది. ముసాయిదాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.

దీంతో రాష్ట్రంలోని ఓటర్లంతా తమ పేరు జాబితాలో ఉందో లేదో మరోసారి పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. సుమారు 92 లక్షల మంది ఓటర్లకు నోటీసులు ఇవ్వనున్నారు. వీరిలో 73 లక్షల మంది ఏఎస్డీ (Absent, Shifted, Duplicate) కేటగిరీలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

నోటీసులు జారీ
ఏఎస్డీ జాబితాలో ఉన్నవారికి నోటీసులు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. నోటీసు అందుకున్న వారు సెప్టెంబర్ 16లోగా తమ సమాధానాన్ని సంబంధిత అధికారులకు అందించాలి. నిర్ణీత గడువులోగా స్పందించి అవసరమైన వివరాలను సమర్పించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అదే సమయంలో అర్హత ఉన్నప్పటికీ ముసాయిదా జాబితాలో తమ పేరు కనిపించని వారు కూడా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. నిబంధనల ప్రకారం సంబంధిత దరఖాస్తు ప్రక్రియ ద్వారా ఓటు నమోదు కోసం అవకాశం ఉంటుంది.

మీ పేరు ఉందా.. ఓసారి చూసుకోండి
ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైన నేపథ్యంలో.. **మీ పేరు జాబితాలో ఉందా? మీ ఓటరు వివరాలు సరిగ్గానే ఉన్నాయా?** అనేది ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గతంలో నివాసం మారిన వారు, ఓటరు వివరాల్లో మార్పులు చేసుకున్న వారు తప్పనిసరిగా తమ వివరాలను చెక్ చేసుకోవాలి.

ఇలా చెక్ చేసుకోవచ్చు
ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ https://www.eci.gov.in/ ను తెరవాలి.
SIR-2026 Download Electoral Roll ఆప్షన్ను ఎంచుకోవాలి.
రాష్ట్రంగా తెలంగాణను ఎంపిక చేయాలి.
మీ జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం, భాషను ఎంచుకోవాలి.
మీకు సంబంధించిన పార్ట్ నంబర్ను ఎంపిక చేయాలి.
క్యాప్చా కోడ్ను నమోదు చేసి జాబితాను డౌన్లోడ్ చేసుకోవాలి.
డౌన్లోడ్ అయిన PDFలో మీ పేరు, సీరియల్ నంబర్ లేదా EPIC నంబర్ ద్వారా వివరాలను పరిశీలించాలి.


